Corporate Donation To Parties : దేశంలో జాతీయపార్టీలకు విరాళాలు గణనీయంగా పెరిగాయి. కార్పొరేట్, వ్యాపార సంస్థలు 2019-20 ఆర్థిక సంవత్సరంలో జాతీయ పార్టీలకు రూ.921.95 కోట్లు విరాళంగా ఇచ్చాయి. ఇందులో అత్యధికంగా రూ.720.40 కోట్లు బీజేపీ పొందింది. 2017-18 నుంచి 2018-19 ఏడాదికి కార్పొరేట్ల విరాళాలు 109 శాతానికి పెరిగాయని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ (ADR)తెలిపింది.
ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20,000 కన్నా ఎక్కువ విరాళాలు ఇచ్చిన దాతల గురించి భారత ఎన్నికల కమిషన్ కు(ECI)పార్టీలు ఇచ్చిన వివరాల ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విశ్లేషణ చేసింది. 5 జాతీయ పార్టీల్లో బీజేపీ 2,025 కార్పొరేట్ దాతల నుంచి రూ.720.40 కోట్ల విరాళాలు పొందింది. గతంలో 2016-17కు గానూ బీజేపీ రూ.532 కోట్లు దక్కించుకోగా.. 2018-19 ఆర్థిక సంవత్సరంలో బీజేపీ రూ.785.77 కోట్లు విరాళాలు అందినట్లు ప్రకటించింది. కాగా, ఇప్పుడు 2019-20 ఏడాదిలో స్వల్పంగా తగ్గి రూ.720.40 కోట్ల విరాళాలు అందాయి.
ఈ విషయంలో రెండో స్థానంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. 2019-20 ఏడాదికి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన విరాళాలు రూ.133.04కోట్లు, ఎన్సీపీకి రూ.57.086 కోట్లుగా ఉన్నాయి. కాగా,సీపీఎంకు ఎలాంటి కార్పొరేట్ ఫండ్స్ రాలేదని ఏడీఆర్ వెల్లడించింది. కాగా అత్యధిక విరాళాలు ఇచ్చిన కంపెనీగా ఫ్రడెంట్ ఎలక్ట్రోరల్ ట్రస్ట్ నిలిచింది. ఈ సంస్థ బీజేపీ, కాంగ్రెస్ కు కలిపి రూ.247 కోట్లు విరాళాలు అందించింది.