Richest MLA's in India : దేశంలో ధనిక ఎమ్మెల్యేల జాబితాపై ఓ రిపోర్టు తయారు చేసింది ఏడీఆర్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్లు టాప్ 10లో నిలిచారు.
Richest MLA's in India : దేశంలో ఉన్న ధనిక ఎమ్మెల్యేల జాబితాకు సంబంధించిన రిపోర్టును తాజాగా విడుదల చేసింది ఏడీఆర్ (అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్) ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత, ప్రస్తుత ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు.. ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు! అయితే.. టాప్లో ఉన్న ఎమ్మెల్యే ఆస్థి విలువకు.. ఈయన సంపదకు మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని చూస్తే షాక్ అవ్వాల్సిందే..
ధనిక ఎమ్మెల్యేల జాబితా..
దేశంలోని 28 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 4001 మంది ఎమ్మెల్యేల ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించి, ఈ నివేదికను రూపొందించింది ఏడీఆర్. టాప్ 10 ధనిక ఎమ్మెల్యేల్లో నలుగురు చట్టసభ్యులు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఉండగా.. బీజేపీ నుంచి ముగ్గురు ఉన్నారు.
కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ (కాంగ్రెస్).. ఈ లిస్ట్లో టాప్లో ఉన్నారు. 2023 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్థుల విలువ రూ. 1,413కోట్లు!
రెండో స్థానంలో కర్ణాటక ఎమ్మెల్యే కేహెచ్ పుట్టస్వామి గౌడ (స్వతంత్ర అభ్యర్థి) ఉన్నారు. ఆయన ఆస్థి విలువ రూ. 1,267 కోట్లు.
మూడో స్థానంలో కర్ణాటక కాంగ్రెస్కు చెందిన ప్రియాకృష్ణ ఉన్నారు. ఆయన వద్ద రూ. 1,156కోట్లు విలువ చేసే సంపద ఉంది.
Chandra Babu Naidu assets : ఇక నాలుగో జాబితాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారు. 2019 ఎన్నికల సమయంలో ఆయన సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. ఆయన ఆస్థుల విలువ రూ. 668కోట్లు!
గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే జయంతిభాయ్ సోమాభాయ్ పటేల్ (రూ. 661కోట్లు), కర్ణాటక కాంగ్రెస్కు చెందిన సురేశ్ బీఎస్ (రూ. 648కోట్లు), ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (రూ. 510కోట్లు), మహారాష్ట్ర బీజేపీకి చెందిన పరాగ్ షా (రూ. 500కోట్లు), ఛత్తీస్గఢ్ కాంగ్రెస్కు చెందిన టీఎస్ బాబా(రూ. 500కోట్లు), మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే మంగల్ప్రభాత్ లోధా (రూ. 441కోట్లు)లు ఈ జాబితాలో తదుపరి స్థానాల్లో కొనసాగుతున్నారు.
తక్కువ ఆస్థులు ఉన్న ఎమ్మెల్యేలు వీరే..
Chandra Babu Naidu net worth : ధనిక ఎమ్మెల్యేలతో పాటు తక్కువ సంపద ఉన్న చట్టసభ్యుల వివరాలను కూడా ప్రకటించింది ఏడీఆర్. వీరిలో పశ్చిమ్ బెంగాల్ బీజేపీకి చెందిన నిర్మల్ కుమార్ ధారా టాప్లో ఉన్నారు. ఆయన ఆస్థి విలువ రూ. 1,700!
ఒడిశా స్వతంత్ర ఎమ్మెల్యే మకరందన్ ముదాలి వద్ద రూ. 15వేలు విలువ చేసే ఆస్థులు మాత్రమే ఉన్నాయి. పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలు నరిందర్ పాల్ సింగ్ (రూ. 18,370), నరిందర్ కౌర్ భరాజ్ (రూ .24,409), ఝార్ఖండ్ జేఎంఎంకు చెందిన మంగల్ కలింది (రూ. 30వేలు)లు తదుపరి స్థానాల్లో కొనసాగుతున్నారు.