Source: 
TV9 Telugu
Author: 
Date: 
10.07.2021
City: 

 నరేంద్ర మోడీ నయా కేబినెట్‌కు సంబంధించిన మరో ఆసక్తికర విషయమిది. కేంద్ర కేబినెట్‌ను ప్రధాని మోడీ కొన్ని రోజుల క్రితం సమూల ప్రక్షాళన చేయడం తెలిసిందే. బుధవారం కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం అనంతరం ప్రధాని మోడీ వారికి శాఖలు కేటాయించారు. కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో 15 మంది కేబినెట్ హోదా మంత్రులు కాగా…28 మంది సహాయ మంత్రి హోదాలో ఉన్నారు. వీరిని కలుపుకుని కేంద్ర మంత్రివర్గంలోని మొత్తం సభ్యుల సంఖ్య 78 కు చేరింది. కేంద్ర కేబినెట్‌లోని మంత్రుల్లో దాదాపు సగానికి సగం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు 42శాతం మంది తమ అఫిడవిట్లలో డిక్లేర్ చేసినట్లు ఎన్నికల హక్కుల కోసం పనిచేస్తున్న ఎన్జీవో సంస్థ – అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్(ADR) తన రిపోర్ట్‌లో తెలిపింది. 33 మంది మంత్రులపై క్రిమినల్ కేసులుండగా… వీరిలో 24 మంది మంత్రులు హత్య, హత్యాయత్నం, దోపిడీ వంటి తీవ్ర నేరాభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికలకు ముందు నామినేషన్లతో పాటు సమర్పించిన అఫిడవిట్‌లలోని కేసుల వివరాలను విశ్లేషించి ఏడీఆర్ ఈ రిపోర్ట్‌ను రూపొందించింది.

90శాతం మంది కోటీశ్వరులే..

కేంద్ర కేబినెట్‌లో 90 శాతం మంది కోటీశ్వరులు కావడం విశేషం. తమకు కోటి రూపాయల కంటే ఎక్కువ విలువ చేసే ఆస్తులున్నట్లు వారు తమ ఎన్నికల అఫిడవిట్లలో తెలిపారు. వీరిలో నలుగురు మంత్రులు రూ.50 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులతో…అత్యధిక ఆస్తులు కలిగిన కేంద్ర మంత్రుల కేటగిరీలో ఉన్నారు. జ్యోతిరాదిత్య సింథియా(రూ.379 కోట్లు) అగ్రస్థానంలో నిలుస్తుండగా… పీయూష్ గోయల్(రూ.95 కోట్లు), నారాయణ్ రాణె(రూ.87 కోట్లు), రాజీవ్ చంద్రశేఖర్(రూ.64 కోట్లు) ఈ జాబితాలో  తదుపరి స్థానాల్లో ఉన్నారు.

కేంద్ర మంత్రుల సరాసరి ఆస్తుల విలువ రూ.16.24 కోట్లుగా ఉన్నట్లు ఏడీఆర్ తన రిపోర్ట్‌లో తెలిపింది. కేంద్ర మంత్రుల్లో అతి తక్కువ ఆస్తులు డిక్లేర్ చేసిన వారిలో రూ.6 లక్షల ఆస్తులతో త్రిపుర రాష్ట్రానికి చెందిన ప్రతిమా భౌమిక్ ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన జాన్ బిర్లా రూ.14 లక్షలు, రాజస్థాన్‌కు చెందిన కైలాష్ చౌదరీ రూ.24 లక్షల ఆస్తులు, ఒడిశాకు చెందిన బిశ్వేశ్వర్ తుడు రూ.27 లక్షల ఆస్తులు, మహారాష్ట్రకు చెందిన వీ.మురళీధరన్ రూ.27 లక్షల విలువ చేసే ఆస్తులన్నట్లు డిక్లేర్ చేశారు.

© Association for Democratic Reforms
Privacy And Terms Of Use
Donation Payment Method