BJP donations : 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భారీ ఆధిక్యాన్ని సాధించింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం మొత్తం పంపిణీ చేసిన నిధుల్లో 82.52 శాతం బీజేపీకే దక్కాయి. మొత్తంగా రూ. 3,826.35 కోట్ల విరాళాల్లో బీజేపీ ఒక్కదానికే రూ. 3,157.65 కోట్లు అందాయి.
ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి రూ. 298.78 కోట్లు (7.81%) మాత్రమే లభించగా, తృణమూల్ కాంగ్రెస్కు రూ. 102 కోట్లు (2.67%) అందాయి. మిగిలిన 19 రాజకీయ పార్టీలకు కలిపి రూ. 267.92 కోట్లు పంపిణీ అయ్యాయి. విరాళాలు అందించిన సంస్థల్లో Elevated Avenue Realty LLP రూ. 500 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా, టాటా సన్స్, టీసీఎస్, మేఘా ఇంజినీరింగ్ తదితర సంస్థలు కూడా భారీగా విరాళాలు అందించాయి.
రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్ర నుంచి అత్యధికంగా రూ. 1,225 కోట్లు అందగా, తెలంగాణ నుంచి రూ. 358 కోట్లు రావడం విశేషం. దేశంలో నమోదైన 20 ఎలక్టోరల్ ట్రస్టుల్లో కేవలం 10 మాత్రమే తమ నివేదికలను సమర్పించగా, మిగిలిన వాటి వివరాలు బయటకు వస్తే మొత్తం విరాళాల పరిమాణం మరింత పెరిగే అవకాశం ఉందని ADR తెలిపింది.
