Chandrababu Naidu Richest Chief Minister in India: దేశంలో సంపన్న ముఖ్యమంత్రుల్లో ఏపీ సీఎం చంద్రబాబు తొలి స్థానంలో నిలిచారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ విడుదల చేసిన నివేదికలో తెలిపారు. దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యంత పేద సీఎంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిలిచారు. ఆమె వద్ద కేవలం రూ.15 లక్షల ఆస్తే ఉందని ఏడీఆర్ పేర్కొంది. ఈ జాబితాలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఏడో స్థానంలో నిలిచారు. ఆయనకు రూ.30.04 కోట్ల ఆస్తులు ఉన్నాయి.
దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిలిచారు.. ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్) ఈ మేరకు సీఎంల ఆస్తుల వివరాలను వెల్లడించింది. చంద్రబాబుకు మొత్తం ఆస్తులు రూ.931 కోట్లున్నాయని.. అప్పు రూ.10 కోట్లు ఉందని తెలిపింది. దేశంలో తక్కువ ఆస్తి రూ.15 లక్షలతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ జాబితాలో అట్టడుగున ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు దాఖలుచేసిన అఫిడవిట్ ప్రకారం.. ఆయన పేరిట రూ.36 కోట్ల ఆస్తులు ఉంటే.. ఆయన సతీమణి భువనేశ్వరి పేరిట ఏకంగా రూ.895 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అఫిడవిట్లో ప్రస్తావించిన ఆస్తుల్లో హెరిటేజ్ ఫుడ్స్లో ఉన్న షేర్లనూ కలిపి లెక్కించారు.
ఏపీ సీఎం చంద్రబాబు తర్వాత రెండో స్థానంలో.. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూ నిలిచారు.. ఆయన పేరుతో రూ.332 కోట్ల ఆస్తులు ఉన్నాయి. మూడో స్థానంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉన్నాయి.. ఆయన ఆస్తులు రూ.51.93 కోట్లు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆస్తులు రూ.30 కోట్లకుపైగా ఉన్నాయి.. ఆయనకు రూ. కోటి అప్పు ఉంది. కేరళ ముఖ్యమంత్రి పినరయీ విజయన్ పేరిట రూ.1.18 కోట్లు.. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేరిట రూ.55 లక్షల ఆస్తులు ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రుల సగటు ఆస్తి ఏకంగా రూ.52.59 కోట్లుగా తేలింది.
దేశవ్యాప్తంగా అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రుల జాబితాను కూడా విడుదల చేశారు. ఇందులో దేశంలోనే అత్యధిక కేసులు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిపై ఉన్నాయి.. ఆయనపై ఏకంగా 89 కేసులు పెండింగ్లో ఉన్నాయి. రేవంత్ తర్వాత రెండో స్థానంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఉన్నారు.. ఆయనపై 47 కేసులు ఉన్నాయి. మూడో స్థానంలో ఏపీ సీఎం చంద్రబాబు 19కేసులతో ఉన్నారు. మరోవైపు 31 మంది సీఎంలలో 9 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు.. ఇద్దరు డాక్టరేట్ పొందారు. మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల్లో కేవలం ఇద్దరే మహిళా సీఎంలు ( బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ అతిశి) ఉన్నారు.
