ఇంటర్నెట్ డెస్క్: దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేగా (Richest MLA) మహారాష్ట్రకు చెందిన భాజపా నేత పరాగ్ షా నిలిచారు. ముంబయిలోని ఘాట్కోపర్ తూర్పు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ఆస్తుల విలువ రూ.3400 కోట్లుగా అంచనా. ఎమ్మెల్యేల ఆర్థిక, నేర, రాజకీయ నేపథ్యానికి సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADS) చేసిన విశ్లేషణలో ఈ విషయం వెల్లడైంది. సంపన్న ఎమ్మెల్యేల జాబితాలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రెండో స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.1413 కోట్లుగా ఏడీఆర్ పేర్కొంది. ఇక అత్యంత పేద ఎమ్మెల్యేగా పశ్చిమ బెంగాల్కు చెందిన భాజపా ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధారా ఆస్తుల విలువ కేవలం రూ.1700 కావడం విశేషం.
ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్లను ఏడీఆర్ పరిశీలించింది. 28 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 4092 ఎమ్మెల్యేల ఆర్థిక పరిస్థితి, వారిపై ఉన్న కేసులను విశ్లేషించింది. దస్త్రాలు సరిగ్గా స్కాన్ చేయకపోవడంతో 24 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లను పరిశీలించలేకపోయినట్లు ఏడీఆర్ తెలిపింది. ఏడు అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
