2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశంలో అత్యధికంగా విరాళాలు అందుకున్న ప్రాంతీయ పార్టీల్లో భారాస ముందుంది. ఆ తర్వాతి స్థానాల్లో వైకాపా, తెదేపా ఉన్నాయి. ఆ ఆర్థిక సంవత్సరంలో రూ.216.76 కోట్లను విరాళాలుగా అందుకున్నట్లు ప్రాంతీయ పార్టీలు వెల్లడించాయి. అందులో ఒక్క భారాసకే రూ.154.03 కోట్లు లభించాయి. ఎన్నికల సంఘాని (ఈసీ)కి ఆయా పార్టీలు సమర్పించిన వివరాలను విశ్లేషించిన అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం
57 ప్రాంతీయ పార్టీలను విశ్లేషించగా.. అందులో 18 పార్టీలు మాత్రమే నిర్దేశిత కాలపరిమితిలోగా విరాళాల వివరాలను ఈసీకి సమర్పించాయి. 2-164 రోజుల జాప్యంతో మరో 17 పార్టీలు ఆ డేటాను అందించాయి. బీజేడీ, నేషనల్ కాన్ఫరెన్స్ సహా ఏడు పార్టీలు తమకు ఆ ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి విరాళాలు అందలేదని ప్రకటించాయి.
2,119 విరాళాల ద్వారా 28 ప్రాంతీయ పార్టీలకు అందిన రూ.216.76 కోట్లపై ఏడీఆర్ విశ్లేషణ జరిపింది.
భారాసకు మొత్తం 47 విరాళాల ద్వారా రూ.154.03 కోట్లు అందగా.. వైకాపాకు రూ.16 కోట్లు, తెదేపాకు రూ.11.92 కోట్లు లభించాయి. విరాళాల్లో 90.56 శాతం.. భారాస, వైకాపా, తెదేపా, డీఎంకే, సీపీఐలకు అందాయి.
అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022-23లో కొన్ని పార్టీలకు అందిన విరాళాల్లో గణనీయ పెరుగుదల నమోదైంది. ఇందులో జేఎంఎం (3,685% పెరుగుదల), జననాయక్ జనతా పార్టీ (1,997%), తెదేపా (1,795%) అగ్రస్థానాల్లో ఉన్నాయి.
సమాజ్వాదీ పార్టీ, శిరోమణి అకాలీ దళ్ వంటి పార్టీలకు విరాళాలు తగ్గాయి.
విరాళాల్లో నగదు వాటా 0.099 శాతమే (రూ.21.45 లక్షలు) ఉంది.
ఈ విరాళాల్లో కార్పొరేట్, వ్యాపార సంస్థల వాటా 78 శాతం (రూ.169.2 కోట్లు)గా ఉంది. మిగతా సొమ్ము వ్యక్తుల నుంచి అందింది. కార్పొరేట్ విరాళాలు అందుకున్న ప్రాంతీయ పార్టీల్లో భారాస (రూ.138.97 కోట్లు) ముందుంది.
దిల్లీకి చెందిన దాతల నుంచి అత్యధికంగా రూ.107.09 కోట్లు అందాయి. ఆ తర్వాతి స్థానాల్లో తెలంగాణ (రూ.62.99 కోట్లు), ఆంధ్రప్రదేశ్ (రూ.8.39 కోట్లు) ఉన్నాయి.